
తెలుగు సినిమా నిర్మాత బండ్ల గణేష్ తన మొక్కును తీర్చుకోవడానికి ఒక మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో, ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. ఆ కోరిక తీరడంతో ఇప్పుడు తన మొక్కును తీర్చుకోవడానికి షాద్నగర్ నుంచి తిరుమల వరకు కాలినడకన పాదయాత్ర చేయనున్నారు.
ఈ నెల 19వ తేదీన షాద్నగర్లోని తన స్వగృహం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు బండ్ల గణేష్. భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి, అభిమానులు, సినిమా ప్రముఖుల మధ్య ఈ యాత్రను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమే ఈ యాత్ర లక్ష్యం. ఈ కార్యక్రమం భారీగా జరగనుందని, అనేక మంది అభిమానులు దీనికి మద్దతు ఇవ్వనున్నారని తెలుస్తోంది.


