
“కొత్త తరం రాజకీయాలు”, “నవశకం పాలన” అంటూ ప్రజల్లోకి వెళ్లిన నాయకత్వం ఇప్పుడు జ్యోతిష్యుడిని అధికారికంగా ఓఎస్డీగా (Officer on Special Duty) నియమించుకున్నట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు సీఎం కార్యాలయం తమ వ్యక్తిగత జ్యోతిష్యుడికి ఓఎస్డీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఆయనకు క్యాబినెట్ హోదా కూడా దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వ వ్యవస్థలో అధికారిక స్థానం ఇవ్వడం సరైనదేనా? అనే ప్రశ్నలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలు ప్రజా ప్రయోజనాల ఆధారంగా ఉండాలే గానీ జ్యోతిష్యంపై ఆధారపడకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో అయితే సెటైర్లు, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. “ఇకపై సీఎం గారి కార్యక్రమాల టైమింగ్స్, ఏ కారు ఎక్కాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి అన్నది కూడా ఈ జ్యోతిష్యుడే నిర్ణయిస్తారా?” అంటూ నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.
మరోవైపు, వ్యక్తిగత విశ్వాసాలు వేరు, ప్రభుత్వ వ్యవస్థ వేరు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారిక పదవులకు అర్హతలు, బాధ్యతలు స్పష్టంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ నియామకంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ విషయం రాజకీయంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.


