నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కుల కేసులో మధ్యంతర ఉపశమనం ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

హీరో దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల కేసులో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ఆయన పేరు, ఫోటోలు, అనుమతి లేకుండా తయారు చేసిన మెర్చండైజ్‌, AI ద్వారా రూపొందించిన కంటెంట్‌, ఆన్‌లైన్ వీడియోలను అక్రమంగా ఉపయోగిస్తున్నారని కోర్టులో ఫిర్యాదు చేశారు.

నాగ చైతన్య తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ వైభవ్ గగ్గర్ మాట్లాడుతూ, కొన్ని వెబ్‌సైట్లు హీరో పేరు‌తో అసభ్యకరమైన సెర్చ్ పదాలను జత చేసి ట్రాఫిక్ పెంచుకుంటున్నాయని కోర్టుకు తెలిపారు. అలాగే, ఆయన ఫోటోలు ఉపయోగించి అనుమతి లేకుండా వస్తువులు విక్రయిస్తున్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసులో AI ద్వారా మార్పులు చేసిన వీడియోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అవమానకరమైన కంటెంట్ కూడా ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతి సింగ్ ప్రతివాదులకు సమన్లు జారీ చేసి, తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. తరచుగా కొత్త వెబ్‌సైట్లు, URLs ద్వారా జరుగుతున్న ఉల్లంఘనలను అరికట్టేందుకు డైనమిక్ ఇంజంక్షన్ ఇవ్వాలని కూడా పిటిషనర్ కోర్టును కోరారు.

ప్రతివాదుల సమాధానాలు వచ్చిన తర్వాత కేసుపై తదుపరి విచారణ జరగనుంది. ఆన్‌లైన్‌లో వ్యక్తిత్వ హక్కుల దుర్వినియోగం, అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై చట్టపరమైన రక్షణ ఎంతవరకు ఉండాలనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది.

Related Articles

Latest Articles