
తెలుగు ఫిలిం చాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్కు తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ బాలగోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ… “తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో రెండు, మూడు సార్లు చర్చలు జరిగాయి. ‘హరి హర వీరమల్లు’ సమయంలో రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ సంవత్సరం గడిచినా ఎలాంటి పరిష్కారం కాలేదు. ‘పెద్ది’ సినిమాకు మాకు పర్సంటేజీ విధానం కావాల్సిందే. మమ్మల్ని నిర్మాతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో గ్రేడింగ్ అంటున్నారు. మొదట మూడు వారాలు అన్నారు.. ఇప్పుడు ఆరు వారాలు అంటున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తాం” అని స్పష్టం చేశారు.
సుదర్శన్ థియేటర్ బాలగోవింద్ రాజ్ మాట్లాడుతూ… “120 మంది థియేటర్ ఓనర్లు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. కావాలనే నిర్మాతలు ఆలస్యం చేస్తున్నారు. ముందు మూడు వారాలు అన్నారు.. ఇప్పుడు మళ్లీ మరో మూడు వారాలు వాయిదా వేస్తున్నారు. మాకు పర్సంటేజ్ విధానం కావాల్సిందే. ఎంత శాతం ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. 10-15 ఏళ్ల క్రితం థియేటర్లకు మంచి రెవెన్యూ ఉండేది. ఇప్పుడు ఎగ్జిబిటర్లకు ఆదాయం రావడం లేదు. కానీ నిర్మాతలకు మాత్రం 14 రకాలుగా ఆదాయం వస్తోంది” అని అన్నారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ… “దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పర్సంటేజ్ విధానం అమల్లో ఉంది. ఇక్కడ మాత్రమే రెంటల్ విధానం కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారు” అని ఆరోపించారు.


